Atmakur
రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆరోపించారు.
ఆత్మకూరులో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గృహనిర్మాణ నిధులను సకాలంలో వినియోగించకపోవడం వల్ల పేదలకు అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా సుమారు రూ.200 కోట్ల నిధులు వినియోగం కాకుండా నిలిచిపోయాయని విమర్శించారు. ఇప్పటికే నిర్మాణం చేపట్టిన ఇళ్లకు సంబంధించిన బిల్లులు విడుదల చేయకుండా ఆలస్యం చేయడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను కూడా పూర్తిచేయకుండా ప్రస్తుత ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందన్నారు.
కేంద్ర నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసి దశలవారీగా విడుదల చేయాలన్న అధికారుల ప్రతిపాదనను ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా నిధులను తిరిగి కేంద్రానికి పంపే పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని మేకపాటి విక్రమ్ రెడ్డి విమర్శించారు.

