Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్ మండలం అంబం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు.
ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ శిబిరంలో పశువులకు గాలికుంటు టీకాలు వేసి పాడి రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రుద్రూర్ మండల పశువైద్య అధికారి సంతోష్ మాట్లాడుతూ, వేసవికాలంలో పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం డైరీ ఫారాలు, పెరటి కోళ్ల పెంపకం, పందుల పెంపకానికి సబ్సిడీలు అందిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శిబిరంలో 5 సాధారణ కేసులు, 13 గైనిక్ కేసులకు చికిత్స అందించగా, 5 దూడలకు నులిపురుగు మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా 25 పెంపుడు కుక్కలకు వైద్య చికిత్సలు నిర్వహించినట్లు పశువైద్యాధికారి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్లెం గంగాధర్, ఉపసర్పంచ్ సాయి, పాడి రైతులు శానం సుధాకర్, శేఖర్, కురుమే బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

