తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీవీకే అధినేత విజయ్ శుక్రవారం లోక్ భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో మూడవసారి భేటీ అయ్యారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118 కాగా, ఏకంగా 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను దళపతి గవర్నర్కు అందజేశారు. ఈ కీలక భేటీ అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. దీంతో తమిళనాడులో విజయ్ నేతృత్వంలో సరికొత్త పాలన కొలువుదీరనుంది. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీ మెట్లు ఎక్కిన టీవీకే, ఏకంగా అధికారాన్ని కైవసం చేసుకోవడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అభిమానులు, కార్యకర్తలు లోక్ భవన్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు.
తొలి అడుగులో తడబాటు ఈ విజయ ప్రస్థానంలో విజయ్ తొలుత కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నారు. ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు సాధించినప్పటికీ, మేజిక్ ఫిగర్కు కొద్ది దూరంలో నిలిచింది. మొదటిసారి గవర్నర్ను కలిసినప్పుడు సమర్పించిన మద్దతు లేఖలో దొర్లిన వ్యూహాత్మక లోపం అడ్డంకిగా మారింది. స్వతంత్ర హోదాకు బదులు ఇతర పార్టీల సంతకాలతో జాబితా ఇవ్వడం వల్ల అది సంకీర్ణ ప్రభుత్వంగా గవర్నర్ పరిగణించారు. 118 మంది మద్దతు స్పష్టంగా నిరూపిస్తేనే ఆహ్వానిస్తానని గవర్నర్ తేల్చి చెప్పడంతో కొద్ది గంటల పాటు ఉత్కంఠ నెలకొంది.కలిసొచ్చిన మిత్రపక్షాలు విజయ్ లక్ష్యానికి కాంగ్రెస్, వామపక్షాలు, విసికే పార్టీలు వెన్నుదన్నుగా నిలిచాయి. కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలు, సీపీఎం ఇద్దరు సభ్యులతో పాటు ఇతర చిన్న పార్టీల తోడ్పాటుతో సంఖ్యాబలం 120కి చేరింది. దశాబ్దాల డీఎంకే బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం ఇక్కడ అత్యంత కీలక పరిణామం. లెఫ్ట్ పార్టీలు, వీసీకే సాయంతో దళపతి సీఎం పీఠం ఎక్కనున్నారు.

