- జలసంధిలో నౌకలపై దాడులు- ఇరాన్ పౌర నివాసాలపై అమెరికా దాడి- ఒప్పందానికి రాకుంటే ఇరాన్ను వేధిస్తాం : ట్రంప్ టెహ్రాన్/ వాషింగ్టన్ : పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి.
కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ హర్మూజ్ జలసంధి ప్రాంతం దాడులు, ప్రతి దాడులతో అట్టుడికిపోయింది. ఒకవైపు ఒప్పందానికి ఇరుదేశాలు దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తుండగా, మరోవైపు పరస్పరం దాడులు చోటుచేసుకున్నాయి. అమెరికా దళాలు ఇరాన్లోని పౌర నివాసాలపై వైమాని దాడులు చేసిందని ఆ దేశ ప్రభుత్వ మీడియా శుక్రవారం తెలిపింది. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్ సమీపంలో పలు పేలుళ్లు చోటుచేసుకున్నాయని కూడా ధ్రువీకరించింది. పశ్చిమ టెహ్రాన్లో పెద్దగా పేలుడు శబ్దాలు వినిపించాయని వెల్లడించింది. అమెరికా దాడులకు దిగి కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఇరాన్ విమర్శించింది. దీనికి ప్రతిస్పందనగా తమ దాడుల్లో అమెరికా నౌకలు దెబ్బతిన్నాయని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్( ఐఆర్జిసి) ప్రకటించింది. తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు యుఎస్ఎస్ ట్రక్స్టన్ ( డిడిజి 103), యుఎస్ఎస్ రఫేల్ పెరాల్టా (డిడిజి 115), యుఎస్ఎస్ మాసన్ (డిడిజి 87) అంతర్జాతీయ జలాలలో ప్రయాణిస్తుండగా ఇరాన్ దళాలు అనేక క్షిపణులను ప్రయోగించిందని, అయితే అవేవీ తమ నౌకలను తాకలేకపోయాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని కూడా తెలిపింది. ఇరాన్ నుంచి అనూహ్యంగా వచ్చిన దాడులను తాము అడ్డుకున్నామని.. ఆత్మరక్షణ కోసం వాటికి ప్రతిస్పందించామని అమెరికా తెలిపింది. ఈ దాడుల్లో ఏ నౌకలూ దెబ్బతినలేదని ప్రకటించింది.
ఒప్పందానికి రాకుంటే దాడులే : ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ ను బెదిరించారు. హర్మూజ్లో చోటుచేసుకున్న ఘర్షణలపై ట్రంప్ స్పందిస్తూ. ఇరాన్ త్వరగా ఒప్పందంపై సంతకం చేయాలని రావాలని లేకుంటే భీకర దాడులు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ పెట్టారు. 'ఒప్పందంపై సంతకం చేయకపోతే భవిష్యత్తులో వారిని మరింత కఠినంగా, మరింత హింసాత్మకంగా వేధిస్తాం. త్వరపడండి' అని _తెలిపారు. 'మా నౌకలపై క్షిపణులను ప్రయోగించారు. వాటిని తేలికగానే కూల్చేశాం. అలాగే డ్రోన్లు వచ్చాయి. వాటిని గాలిలో ఉండగానే అడ్డుకున్నాం. అవి చాలా అత్యద్భుతంగా సముద్రంలో పడిపోయాయి…' అంటూ రాసుకొచ్చారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం కొనసాగుతోందనడం గమనార్హం. అలాగే దీన్ని ఒక ప్రేమపూర్వకమైన చర్యగా ట్రంప్ అభివర్ణించారు. కాల్పుల మధ్యనే హర్మూజ్ మీదుగా మూడు అమెరికా నౌకలు ప్రయాణించాయని, ఆ సమయంలో ఇరాన్ దళాలు దాడులకు దిగాయన్నారు. అయితే, ఈ దాడుల్లో నౌకలకు ఎటువంటి నష్టం జరగలేదని, కాని ఇరాన్ దుండగులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు.
ఇరాన్లో పేలుడు శబ్దాలు.. ఖెష్మ్ దీవిలోని బహ్మన్ పియర్ వద్ద ఉన్న వాణిజ్య కేంద్రాల వద్ద ఇరాన్ భద్రతా దళాలు, అమెరికా సేనల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని టెహ్రాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఖెష్మ్ దీవి, బందర్ అబ్బాస్ సమీపంలో అనేక పేలుడు శబ్దాలు వినిపించాయని చెప్పింది. టెహ్రాన్లో కూడా పేలుడు శబ్దాలు వినిపించాయి. ఎలాంటి అనుమతులు లేకుండా హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న కొన్ని నౌకలకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి) హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇరాన్ వైపు క్షిపణులు, డ్రోన్లు వచ్చి పడుతున్నాయని, వాటిని ఎదుర్కొంటున్నామని యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ ( యుఎఇ) తెలిపింది.

