Jagithyal
Jagithyal: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థుల అడ్మిషన్లపై అవగాహన కల్పించేందుకు "వాక్ ఫర్ అడ్మిషన్" కార్యక్రమాన్ని నిర్వహించారు.
శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ పి. గోపాల్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, గ్రామ పెద్దలు కలిసి స్థానిక బస్టాండ్ నుంచి అంగడి బజారు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆల్ఫాహారం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు.
ఈ సదుపాయాలపై గ్రామ ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకే "వాక్ ఫర్ అడ్మిషన్" కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జీవన్ రెడ్డి, అధ్యాపకులు వేణు, నాంపల్లి, జైపాల్ రెడ్డి, ప్రమోద్ కుమార్, బాలకృష్ణారెడ్డి, జయశీల, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

