- జిల్లా కేంద్రానికి చేరిన పాఠ్యపుస్తకాలు
- స్కూలు తెరిచే రోజునే విద్యార్థులకు పంపిణీ
- పక్కదారి పట్టకుండా బార్ కోడ్తో సరఫరా
- జిల్లాలో 535 ప్రభుత్వ పాఠశాలలు..
46వేల మంది విద్యార్థులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ముందస్తుగా అడుగులు పడుతున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అనేక విధాలుగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, మధ్యాహ్న భోజనంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం బ్రేక్ఫాస్ట్, విద్యార్థులకు ప్రత్యేక కిట్ల పంపిణీ కూడా అందించబోతున్నారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ఈసారి ముందస్తుగానే జిల్లాలకు పాఠ్యపుస్తకాలను చేరవేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం 77.66 శాతం పార్ట్-1 పాఠ్యపుస్తకాలు చేరాయి. రెండు మూడు రోజుల్లోనే మిగతా పుస్తకాలు కూడా రానున్నాయి. త్వరలోనే పుస్తకాలు మండల కేంద్రాలకు అక్కడి నుంచి పాఠశాలకు పుస్తకాలు పంపిణీ చేస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చిన పుస్తకాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గోదాంలో నిలువ చేశారు.
జిల్లాకు చేరిన 2,06,880 పాఠ్య పుస్తకాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 535 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్, కేజీబీవీ, తెలంగాణ రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ పాఠశాలలో ఉన్నాయి. పాఠశాలల్లో 46 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం కొత్త విద్యా సంవత్సరంలో అవసరమయ్యే పాఠ్య పుస్తకాల్లో పార్ట్-1 పుస్తకాలు 2,59,720 అవసరం అవుతాయని అంచనా వేశారు. వీటిలో ఇప్పటివరకు జిల్లాకు 2,06,880 పాఠ్య పుస్తకాలు వచ్చాయి. వీటిని పాఠశాలకు సరఫరా చేసే చర్యలు చేపట్టారు. పార్ట్- 2 పాఠ్యపుస్తకాలు అక్టోబర్, నవంబర్ మాసాల్లో రానున్నాయి. గతంలో పాఠశాలు ప్రారంభమైన తర్వాత కూడా చాలా రోజుల వరకు పాఠ్యపుస్తకాలు అందని పరిస్థితులు ఉండేవి. విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జనరల్ స్టోర్స్ల వద్ద కొనుగోలు చేసేవారు. అలాంటి పరిస్థితులు లేకుండా గత సంవత్సరం నుంచి విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం రోజే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు. ఈసారి గతంలోకంటే ముందుగానే ఏప్రిల్ మాసం నుంచే పుస్తకాలు జిల్లాలకు సరఫరా చేస్తున్నారు.
పుస్తకాలకు బార్ కోడ్
ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా విద్యార్థులకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పాఠ్య పుస్తకాలపై బార్ కోడ్ ముద్రించారు. పాఠ్యపుస్తకాలపై నంబర్లు కూడా ముద్రించడం ద్వారా జిల్లా కేంద్రం నుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసే సమయంలో కూడా నంబర్లను నమోదు చేసుకుంటారు. అంతేకాకుండా పాఠశాల హెచ్ఎంలు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించే సమయంలో కూడా నంబర్లను నమోదు చేసుకుంటారు. బహిరంగ మార్కెట్లో ఎక్కడైనా ప్రభుత్వ పుస్తకాలను గుర్తుపట్టే వీలు ఉంటుంది.
జిల్లాకు వచ్చిన పుస్తకాలు ఇవీ..
తరగతి రావాల్సిన పుస్తకాలు వచ్చినవి
1వ 9,810 9,810
2వ 9,890 6,640
3వ 11,580 11,580
4వ 12,750 6,430
5వ 18,130 10,530
6వ 36,640 30,640
7వ 31,720 21,250
8వ 39,300 31,250
9వ 44,460 33,060
10వ 45,440 45,440
మొత్తం 2,59,720 2,06,880

