తమిళనాట కొత్త చరిత్ర. సినీ రంగం నుంచి ముఖ్యమంత్రి పీఠం కు చేరిన మరో రియల్ హీరో. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగి అయిదు దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీలను మట్టి కరిపించిన విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అవుతున్నారు.
ఎన్నికల్లో విజయ్ కు ఓటర్లు అధిక మెజార్టీ కట్టబెట్టారు. లెక్కలు.. తేలని పొత్తులతో ప్రమాణ స్వీకారం ఆలస్యం అయింది. మెజార్టీ లెక్కల పై స్పష్టత రావటంతో.. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. ఇందుకు ముహూర్తం ఖరారు అయింది.శనివారం ఉదయం 11 గంటలకు నెహ్రూ స్టేడియం వేదికగా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. దేశం మొత్తం విజయ్ వైపు చూస్తున్న వేళ.. ప్రముఖుల సమక్షంలో.. ముఖ్యమంత్రిగా విజయ్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది.
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సింగిల్ గా పోటీ చేసారు. ఏకంగా 108 స్థానాల్లో విజయం సాధించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. విజయ్ పార్టీకి 108 వచ్చినా.. అందులో విజయ్ గెలిచిన రెండో సీటు ఉంది. దీంతో.. టీవీకే బలం 107. కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ అయిదు స్థానాల మద్దతు ఉందంటూ.. పూర్తి బలం అసెంబ్లీలో నిరూపించుకుంటానని.. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ రెండు సార్లు గవర్నర్ ను కోరారు.
అయితే, పూర్తిగా 118 సంఖ్యా బలంతో వస్తేనే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమవుతుంది అంటూ గవర్నర్ తేల్చి చెప్పారు. దీంతో.. రాజకీయంగా కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి. కాగా.. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు కు కావాల్సిన సంఖ్యా బలం పైన స్పష్టత వచ్చింది. వీసీకే నేత తిరమావళవన్ తాజాగా విజయ్ తో సమావేశం అయ్యారు. మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు విజయ్ అంగీకరించారు.
మళ్లీ గవర్నర్ వద్దకు విజయ్, పూర్తి 'మెజార్టీ' లిస్టుతో- లైన్ క్లియర్, ముహూర్తం..!?
తమిళనాడులో విజయ్ కొత్త చరిత్ర
వీసీకే నుంచి రెండు, సీపీఐ -2, సీపీఎం -2 స్థానాలతో విజయ్ కు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. ఈ సంఖ్యతో గవర్నర్ ఇక విజయ్ ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించటం లాంఛనంగా కనిపిస్తోంది. అటు విజయ్ సైతం మరింత ఆలస్యం చేయకుండా అన్నీ కలిసి వస్తే రేపు (శనివారం) ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దం అవుతున్నారు. మద్దతు ఇచ్చిన నాలుగు పార్టీలకు కేబినెట్ లో అవకాశం ఇవ్వనున్నారు.
తన ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ ను విజయ్ ఆహ్వానించారు. సినీ ప్రముఖులకు టీవీకే నేతలు ఆహ్వానం పలుకుతున్నారు. స్టాలిన్, పళిని స్వామిని ఆహ్వానించాలని నిర్ణయించారు. 20 మంది మత్రులతో విజయ్ తన ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమయ్యారు. రేపు 11 గంటలకు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయటానికి ముహూర్తం ఖరారు అయింది. దీంతో.. విజయ్ అభిమానులు సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు.
Chaitanya Oneindiasource: oneindia.com

